జనతా వార్ గుంటూరు జనవరి 23
దేశం వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను కఠినంగా అమలు చేయాలి
జాతీయ కౌన్సిల్ సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన డి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఏసురత్న
గుంటూరు :దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను అన్ని రాష్ట్రాల్లో కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిహెచ్పిఎస్ (DHPS) జాతీయ కౌన్సిల్ సమావేశంలో కీలక తీర్మానాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఏసురత్నం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ హక్కులుగా పొందాల్సిన సబ్ ప్లాన్ నిధులు అనేక రాష్ట్రాల్లో దారి మళ్లింపుకు గురవుతూ, ఎస్సీ–ఎస్టీ వర్గాల జీవన పరిస్థితులు మెరుగుపడకుండా అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో కేటాయించిన సబ్ ప్లాన్ నిధులు పూర్తిగా ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్య, వైద్యం, ఉపాధి, భూమి, నివాసం, మౌలిక వసతుల అభివృద్ధికే ఖర్చు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.సబ్ ప్లాన్ చట్టబద్ధ అమలు లేకపోవడం వల్లే సామాజిక–ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయని, దీనికి ముగింపు పలకాలంటే దేశవ్యాప్తంగా ఒకే విధమైన సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఏసురత్నం స్పష్టం చేశారు.అలాగే, సబ్ ప్లాన్ నిధుల ఖర్చుపై పారదర్శకత, సామాజిక ఆడిట్, వార్షిక నివేదికలు తప్పనిసరి చేయాలని ఈ తీర్మానంలో డిమాండ్ చేశారు.జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఈ తీర్మానానికి పలువురు ప్రతినిధులు మద్దతు తెలుపుతూ, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. జాతీయ సమితి సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారూపాక అనిల్ కుమార్, జాతీయ సమితి సభ్యులు బోయిని అశోక్, ఆరుట్ల రాజ్ కుమార్, టి రామకృష్ణ, పొన్నగంటి లావణ్య, బి సంతోష తదితరులు పాల్గొన్నారు.